Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 7:44 pm Posted by : VARTHA SANDHYA DESK

హయత్‌నగర్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

19 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం.. ఆరుగురు అదుపులో

పరారిలో మాఫియ డాన్

హైదరాబాద్, మే 07 (వార్త సంధ్య): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద అంబర్‌పేట్‌లోని పిస్తా హౌస్ వెనుక ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

అక్కడ రెండు లారీల్లోకి టాటా ఏసీ వాహనం ద్వారా పీడీఎస్ బియ్యం బస్తాలను ఎక్కిస్తున్న సమయంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల నుంచి చిన్న వాహనాల ద్వారా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి, లారీల్లో నింపి మహారాష్ట్రకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఘటనలో ప్రధాన సరఫరాదారుగా సయ్యద్ ఖాజా నసీర్ (36), ప్రధాన వనరుగా అమీర్ పాషా (32), బడా దోస్త్ వాహన డ్రైవర్ మొహమ్మద్ సాబేర్ (23), లారీ డ్రైవర్లు సిద్ధిక్ భాయ్ (65), కొడేప్ మహేంద్ర (34)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు షేక్ అఖిల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసులు సుమారు 19 టన్నుల పీడీఎస్ బియ్యం (380 బస్తాలు), అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం, రెండు లారీలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.