Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:56 pm Posted by : VARTHA SANDHYA DESK

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

24 గంటల ఉచిత కరెంట్, గృహజ్యోతి, సోలార్ ప్రాజెక్టులపై అవగాహన

  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రైతులకు సబ్సిడీ రుణాలు, యాంత్రికరణ పరికరాల పై వివరాలు
  • గుండుగులపల్లిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 07 (వార్త సంధ్య) : గుండుగులపల్లి రైతువేదికలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ, విద్యుత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సమావేశానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సబ్సిడీ రుణాలు, యాంత్రికరణ పనిముట్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గృహజ్యోతి, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, నూతన సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ప్రయోజనాలను వివరించి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా విద్యుత్ అధికారి మహేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.