Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 2:13 pm Posted by : VARTHA SANDHYA DESK

మహిళల భద్రతపై కాంగ్రెస్ రాజీ పడదు: గజ్జెల కాంతం

బీఆర్ఎస్ పాలనలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయని ఆరోపణ

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని విమర్శ

హైదరాబాద్, జూన్ 12 (వార్త సంధ్య): మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం స్పష్టం చేశారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో మహిళలు, బాలికలపై వందలాది అత్యాచారాలు, దాడులు జరిగాయని ఆరోపించారు.

కేటీఆర్, హరీష్‌రావు కనుసన్నల్లోనే మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు జరిగాయని, అప్పటి ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలపై ఎలాంటి అన్యాయం జరిగినా చట్టపరంగా వేగంగా స్పందిస్తూ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటోందన్నారు.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్  రెడ్డి రాష్ట్రంలోని మహిళలను సొంత చెల్లెల్లుగా భావిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రాహుల్  గాంధీ , రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అమలులో ఉందని చెప్పారు.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్  నామినేషన్ తిరస్కరణపై స్పందించిన గజ్జెల కాంతం, ప్రధాని నరేంద్ర మోడీ , మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థను ఉపయోగించి కుట్ర పూరితంగా వ్యవహరించాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసి నామినేషన్ చెల్లకుండా చేశారని విమర్శించారు.

ప్రధాని మోదీ పాలనపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, దేశ అభివృద్ధికి జవహరలాల్ నెహ్రు చేసిన సేవలను గుర్తు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగం, ఐఐటీలు, జాతీయ విద్యాసంస్థల స్థాపనలో నెహ్రూ పాత్ర కీలకమని అన్నారు. అలాగే ఇందిరా గాంధీ భూ సంస్కరణల ద్వారా పేదలకు భూములు పంపిణీ చేశారని పేర్కొన్నారు.

బీజేపీ కేంద్ర సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వినియోగిస్తోందని ఆరోపించిన గజ్జెల కాంతం, ప్రాంతీయ పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీ వంటి సంస్థల ద్వారా ఒత్తిడి తీసుకొస్తోందని విమర్శించారు. హిందుత్వ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.