హైదరాబాద్, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో హిమాయత్నగర్లో నిర్వహించిన సామూహిక నిధి సేకరణ కార్యక్రమాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. సమాజంలో దోపిడీ, పీడనలేని వ్యవస్థ అయిన సోషలిజం లక్ష్యంగా పార్టీ అనేక ఉద్యమాలను నిర్మిస్తోందన్నారు. అనుబంధ సంఘాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా పోరాటాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాల్లో పాల్గొనాలనే ఆసక్తి చాలామందిలో ఉన్నప్పటికీ, వ్యక్తిగత పనుల కారణంగా సమయం కేటాయించలేకపోతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారు ఆర్థికంగా సహకరించి ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి సహకారం కోరనున్నారని తెలిపారు. ప్రజలు సహకరించి పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలతో ఏర్పడిందని, ఎన్నో నిర్బంధాలను దాటుకుని ప్రజా ఉద్యమాలను నడిపిందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు ప్రజలను ఏకం చేసి చారిత్రాత్మక విజయాలు సాధించిందని తెలిపారు.భూ సంస్కరణలు, ఈఎస్ఐ, పీఎఫ్, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, వయోజన ఓటుహక్కు వంటి అనేక అంశాల్లో పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఉద్యమ రంగంలో ముందుందని పేర్కొన్నారు.నిధి సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, బుధవారం ఒక్కరోజే రూ.71,252 సేకరించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజల మద్దతుతో మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. ఛాయాదేవి, అంజయ్య నాయక్, సీనియర్ నాయకులు ప్రేమ్ పావని, జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమటం యాదగిరి, AIYF రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.