Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 12:37 pm Posted by : VARTHA SANDHYA DESK

శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌పై ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: బాస్

 

హైదరాబాద్, జూలై 15 ( వార్త సంధ్య ): ఉత్తరప్రదేశ్‌లోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) డిమాండ్ చేసింది.

బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాస్ చీఫ్ కోఆర్డినేటర్, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులు భగవంతుడు శ్రీరాముడిపై అపారమైన విశ్వాసంతో సమర్పించిన విరాళాల వినియోగంలో సంపూర్ణ పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని అన్నారు. ట్రస్ట్‌కు సంబంధించి వెలువడుతున్న ఆరోపణలు దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయని పేర్కొన్నారు.

సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న హిందువులు, సాధు సంతులు, వేదపండితులు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికార సంస్థలు ఆరోపణలపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారి హోదా, స్థానం, ప్రభావంతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్ (SIT) నివేదికను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ప్రజాస్వామ్య విలువలు, భక్తుల విశ్వాసం, ధార్మిక సంస్థల విశ్వసనీయతను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో బాస్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్‌తో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.