Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:27 pm Posted by : sairamkodipyaka7@gmail.com

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు…. తీర్మానాలు లేకుండా నిధుల వినియోగం..

– ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి వార్డ్ మెంబర్ల ఫిర్యాదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 22 ( వార్త సంధ్య): పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కలిసి సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి పై ఫిర్యాదు చేశారు.వార్డ్ మెంబర్ల ఆరోపణల ప్రకారం గ్రామపంచాయతీ నిధులు ఎలాంటి తీర్మానాలు లేకుండా వినియోగించబడుతున్నాయి. బాడీ మీటింగ్‌లు నిర్వహించకుండా ఖర్చులు చేస్తున్నారని తెలిపారు. వార్డ్ మెంబర్లను పూర్తిగా పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

పాత బిల్లులు చెల్లించకపోవడం, పని చేసిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం జరుగుతుండగా, ఎంపిక చేసుకుని కొంతమందికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఇది పారదర్శకతకు విరుద్ధమని వార్డ్ సభ్యులు పేర్కొన్నారు.సర్పంచ్ 22-12-2025న పదవిలోకి వచ్చినప్పటికీ, 2023 డిసెంబర్ మరియు 2024 ఆగస్టు కాలానికి చెందిన పనులకు రూ.2,67,327 బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపించారు. పదవిలోకి రాకముందు పనులకు బిల్లులు ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.పాత బకాయిలు చెల్లించాలని అడిగినప్పుడు సర్పంచ్ అవమానకరంగా మాట్లాడినట్లు వార్డ్ మెంబర్లు తెలిపారు. ప్రజల డబ్బును వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారని ఆరోపించారు.ఇంకా బి.ఆర్.ఎస్ ప్రభుత్వ కాలంలో వైస్ ఎంపీపీ, ఇంచార్జి ఎంపీపీగా పనిచేసిన సమయంలో కూడా అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ, ఆ కాలానికి సంబంధించిన వ్యవహారాలపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు.

ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వార్డ్ మెంబర్లు కోరారు. ఈ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత అవసరమని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.