Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:49 pm Posted by : VARTHA SANDHYA DESK

ప్రజారోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే కూనంనేని

  • ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి
  • సీజనల్ వ్యాధులపట్ల ప్రజలను అప్రమత్తం చేయాలి
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ప్రాధాన్యత ఇవ్వండి
  • అందుబాటులో ఉన్న వనరులతో నాణ్యమైన చికిత్స అందించాలి
  • ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించాలి
  • అవసరమైన వైద్య పరికరాల, మందులు, ఖాళీలపై నివేదిక అందించండి
  • సమీక్షా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : వైద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని, ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్యశాల మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడా మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాన్య ప్రజలు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి అందుబాటులో ఉన్న వనరులతోనే నాణ్యమైన చికిత్స అందించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. వైద్యశాలల్లో రోగులకు, సహాయకులకు కావాల్సిన సదుపాయాలు సమకూర్చాలని, పారిశుధ్యం, నీటి వసతి వంటివాటిపై ప్రేత్యేక ద్రుష్టి సారించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయాలని, మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, అవసరమైన వైద్య పరికరాలు మరియు మందుల నిల్వలపై సమగ్ర నివేదికను వెంటనే తనకు అందజేయాలని అధికారులను కోరారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా జవాబు దారీతనంతో పనిచేయాలని, అప్పుడే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.