Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 8:52 am Posted by : జడల నాగప్రసాద్

12 గంటల నిరంతర శ్రమతో ప్రధాన రహదారికి కొత్త రూపు..

సర్పంచ్ లావుడ్య పూర్ణ సేవలకు గ్రామస్థుల ప్రశంసలు

మూడు కిలోమీటర్ల మేర ముళ్లకంపలు, పిచ్చి మొక్కల తొలగింపు

జేసీబీ, డోజర్లతో స్వయంగా పర్యవేక్షించిన సర్పంచ్

డబుల్ రోడ్డును తలపించేలా మారిన ప్రధాన రహదారి

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 09 (వార్త సంధ్య) : లక్ష్మీదేవిపల్లి మండలం పెద్ద తండా నుంచి మునియా తండాకు వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి ఎన్నో రోజులుగా ముళ్లకంపలు, పొదలు, పిచ్చి మొక్కలతో కప్పబడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రహదారికి ఇరువైపులా అడవి మొక్కలు విస్తరించడంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి ఇరుకుగా మారిపోయి రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ప్రయాణం ప్రమాదకరంగా మారేది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, పాఠశాల బస్సులు, అత్యవసర సేవల వాహనాలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, రాత్రి వేళల్లో ప్రయాణం మరింత ప్రమాదకరంగా ఉండేది. ఈ సమస్యను గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సర్పంచ్ లావుడ్య పూర్ణ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామునే పనులను ప్రారంభించిన సర్పంచ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటల పాటు అక్కడే ఉండి ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించారు. జేసీబీ, డోజర్లు, ఇతర యంత్రాల సహాయంతో రహదారి ఇరువైపులా పెరిగిన ముళ్లకంపలు, చెట్లు, పొదలు, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగింపజేశారు. రహదారి వెంట పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించి, రోడ్డు భుజాలను శుభ్రం చేయించడంతో రహదారి విశాలంగా మారి డబుల్ రోడ్డును తలపించేలా రూపుదిద్దుకుంది. దీంతో వాహనదారులకు మెరుగైన దృశ్యమానత ఏర్పడటంతో పాటు, ప్రమాదాల అవకాశాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయని అధికారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ పనుల అనంతరం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని వారు తెలిపారు. పాఠశాల విద్యార్థులు, మహిళలు, రైతులు, వృద్ధులు ప్రతిరోజూ ఈ రహదారిని వినియోగిస్తుండటంతో ఈ అభివృద్ధి పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించడంలో సర్పంచ్ లావుడ్య పూర్ణ చూపిన చొరవ అభినందనీయమని గ్రామ పెద్దలు కొనియాడారు.

 

గ్రామాభివృద్ధి, ప్రజల సౌకర్యాలే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న సర్పంచ్ సేవలు ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. గ్రామస్థులు సర్పంచ్ లావుడ్య పూర్ణకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.