
🟠 కామారెడ్డి | బ్రేకింగ్ న్యూస్
వైభవంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 23( వార్త సంధ్య )
ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం కామారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది.
దేవునిపల్లి విశాల్ మెగా మార్ట్ రోడ్లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభమైన రథయాత్రలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రా దేవి దివ్య రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు “హరే కృష్ణ” మహామంత్ర సంకీర్తన, భజనలు, నృత్యాలతో రథాన్ని లాగుతూ భక్తిపారవశ్యంలో పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రథయాత్ర అయ్యప్ప కళ్యాణ మండపం వరకు చేరుకుంది. అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో హరినామ సంకీర్తన, ఆధ్యాత్మిక ప్రవచనం, జగన్నాథ స్వామివారికి చప్పన్ భోగ్ సమర్పణ, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తదనంతరం విచ్చేసిన భక్తులందరికీ మహాప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.