అధిక చదువు ఒత్తిడే కారణమా..? తల్లిదండ్రుల్లో ఆందోళన
భద్రాద్రి జిల్లా బ్యూరో, మార్చి 14 (వార్త సంధ్య): భద్రాద్రి జిల్లాలో ఒక విద్యార్థి మృతి ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీ చైతన్య పాఠశాలలలో విద్యార్థులపై పెరుగుతున్న చదువు ఒత్తిడి, కఠిన నిబంధనలపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పలు ప్రాంతాల్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలపై విద్యార్థులను ఉన్నత ర్యాంకుల కోసం తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదువు పేరుతో కఠిన నియమాలు విధించి, విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులపై కఠిన చర్యలు, శిక్షలు అమలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
కేవలం కొత్తగూడెం ప్రాంతంలోనే శ్రీ చైతన్యకు చెందిన నాలుగు బ్రాంచీలు ఉన్నట్లు సమాచారం. ఈ పాఠశాలల్లో జరిగిన కొన్ని ఘటనలపై గతంలో కూడా తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో అధికారులు పాఠశాలలను సీజ్ చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని సమాచారం.
గుర్తింపు లేని తరగతులు నిర్వహించడం, అధిక ఫీజులు వసూలు చేయడం, తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెంచడం వంటి అంశాలపై కూడా పలు ఫిర్యాదులు అధికారులకు చేరుతున్నాయి.
టీచర్లపైనా ఒత్తిడి..?
పాఠశాల యాజమాన్యం టీచర్లకు కూడా అడ్మిషన్ల కోసం టార్గెట్లు పెట్టి, మండుతున్న ఎండల్లో అడ్మిషన్లు తెచ్చేలా ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఉపాధ్యాయుల్లో కూడా అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది.
పూర్తిస్థాయి దర్యాప్తు కోరుతున్న తల్లిదండ్రులు
విద్యార్థి మృతి ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.