భద్రాద్రి, జూన్ 29 (వార్త సంధ్య) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అశ్వారావుపేటలో ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. వివరాల ప్రకారం, అశ్వారావుపేటకు చెందిన ఓ రైతు తన పొలంలో అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ఏఈఈ ఎల్. శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో సోమవారం అశ్వారావుపేటలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఉచ్చు పన్నారు. రైతు నుంచి రూ.2 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఇంజనీర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. పట్టుబడిన అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, స్వాధీనం చేసుకున్న నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఏసీబీ నిఘా మరింత కట్టుదిట్టమైనట్లు స్పష్టమవుతోంది. రైతుల నుంచి లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.