Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 9:38 am Posted by : జడల నాగప్రసాద్

మహిళా కాంగ్రెస్‌లో పదవుల పై రగడ..!

  • కష్టపడ్డ వారిని పక్కనబెట్టి సిఫార్సుల రాజకీయం
  • వాహనం ఉన్నవారికే పదవులా..?
  • పార్టీ కోసం కష్టపడ్డ మహిళలకు న్యాయం ఎక్కడ..?
  • ఎమ్మెల్యే రికమండేషన్ ఉంటే చాలు అన్నట్టుగా పార్టీ వైఖరి
  • మహిళా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా..?
  • ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు
  • సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను మరిచిన నాయకులు
  • రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు బహిరంగ విజ్ఞప్తి

 

మహబూబాబాద్ జిల్లా బ్యూరో, మే 27 (వార్త సంధ్య) : మానుకోట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మహిళా కాంగ్రెస్ నాయకురాలు కళావతి సంచలన వ్యాఖ్యలు చేస్తూ పార్టీ కోసం కష్టపడ్డ మహిళా కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. “పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారిని పక్కనబెట్టి కేవలం సిఫార్సులతో పదవులు ఇస్తే ఎలా..?” అంటూ ఆమె ప్రశ్నించారు. అన్ని మీటింగ్లకు హాజరవుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహిళా నాయకులను గుర్తించాలని కోరారు. కొంతమంది సొంత వాహనం ఉంటేనే పదవులు ఇస్తారని మాట్లాడుతున్నారని, “అయితే వాహనం ఉన్నవారే పార్టీ కోసం పని చేయాలా..?” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్‌లో కష్టపడ్డ కార్యకర్తల్లో అసహనం పెరుగుతోందని పేర్కొన్నారు. ఎవరైనా ఎమ్మెల్యే రికమండేషన్‌తో వచ్చినా వారు పార్టీ కోసం చేసిన పనులపై డెమో వీడియోలు, ఫోటోలు, సభ్యత్వ నమోదు వివరాలు పరిశీలించిన తర్వాతే పదవులు ఇవ్వాలని సూచించారు. కేవలం రాజకీయ సిఫార్సుల ఆధారంగా పదవులు ఇస్తే పార్టీ కోసం పని చేసిన మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ఇతర పార్టీల నుంచి ఇటీవల వచ్చిన వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారనే ప్రచారంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.