భద్రాద్రి జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – మార్చి 16: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజావాణి ఒక మంచి వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
ఈ నెల 16వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి, వాటిని సమగ్రంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించాలని కోరారు.
ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.