Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 5:35 pm Posted by : జడల నాగప్రసాద్

పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 10 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీలను ఓ కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు మధిర ప్రాంతానికి చెందిన వైద్యుల కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు సమాచారం. మధిర నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.