- ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలి
- పచ్చదనం పెంపే భవిష్యత్ తరాలకు నిజమైన ఆస్తి
- మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలి
- భూతాపం, వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి
- ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రకృతిని కాపాడుకుందాం
- పచ్చని భూమి కోసం ప్రతి ఇంటా ఒక మొక్క నాటాలి

- మాస్టర్ ఇ.కె విద్యాలయం చైర్మన్ రవికాంత్
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మాస్టర్ ఇ.కె విద్యాలయంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ రవికాంత్, ప్రిన్సిపాల్ మృదుల, ఉపాధ్యాయులు పాల్గొని పాఠశాల ఆవరణలో పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా మాత్రమే ప్రకృతి సమతుల్యతను కాపాడగలమని, ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం పర్యావరణాన్ని రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం మనందరి నైతిక బాధ్యత అని ఆయన అన్నారు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్), వాతావరణ మార్పులు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు కాదని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటడం, నీటి వనరులను కాపాడడం వంటి చిన్నచిన్న చర్యలు కూడా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రవికాంత్ సూచించారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యాసంస్థలు ముందుండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మృదుల, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.