Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 5:36 pm Posted by : govindhu13@gmail.com

తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం: తెలంగాణ హక్కుల సాధన సమితి

నిధులు, నియామకాలు, నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ఖండించిన మేధావులు హైదరాబాద్, జూన్ 20 (వార్త)

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు కలిసి పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ హక్కుల సాధన సమితి నాయకులు విమర్శించారు.

శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రైస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీమర్ల విజేందర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, పశం యాదగిరి, ఎస్.ఎల్. పద్మ, డాక్టర్ ధర్మతేజ్, డాక్టర్ కృష్ణయ్య, కృష్ణుడు, దుర్గయ్య, రాముడు, ప్రదీప్, శివ రామ్ కృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, అయితే ఆ అప్పుల వల్ల సామాన్య ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగలేదని వారు ఆరోపించారు. ఈ నిధులను ప్రధానంగా నీటి ప్రాజెక్టులు, భారీ నిర్మాణాలకు ఖర్చు చేశామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహా మరే ప్రధాన ప్రాజెక్టు పూర్తికాలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా నిర్మాణ లోపాలతో దెబ్బతిన్నదని విమర్శించారు.

ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల కంటే గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రైతుల కోసం గోదాములు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని, వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు.

ప్రస్తుతం కూడా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థల ద్వారా కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రభుత్వం భూములు, రాయితీలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్లు తెలంగాణ స్థానికులకు కల్పించేలా అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమై పూర్తి దశకు చేరుకున్న అన్ని నీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

TELANGANA HAKKULA SADHANA SAMITHI