Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 10:48 am Posted by : జడల నాగప్రసాద్

టీఆర్ఎస్-డి అధ్యక్షుడి పై మాజీ నేత ఫైర్

  • “పార్టీ ప్రజల కోసమా.. డబ్బుల కోసమా?”
  • సభ్యత్వ రుసుము పేరిట దోపిడీ..?
  • “పార్టీలో చేరితే రూ.4,250 కట్టాల్సిందే”.. 
  • నరాల పై తోడేటి శంకర్ గౌడ్ ఆరోపణలు

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 04 (వార్త సంధ్య) : తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్-డి) పార్టీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ పై ఆ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ, సాధారణంగా రాజకీయ పార్టీల్లో సభ్యత్వ రుసుము రూ.50 లేదా రూ.100 మాత్రమే ఉంటుందని, అయితే తన వద్ద నుంచి పార్టీలో చేర్చుకునే సమయంలో రూ.4,250 వసూలు చేశారని ఆరోపించారు. అనంతరం తన ద్వారా పార్టీలో చేరిన వందలాది మంది కార్యకర్తల నుంచి కూడా ఇదే విధంగా డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించగా, తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు. “పార్టీ ప్రజల కోసం స్థాపించారా? లేక ప్రజలను మోసం చేయడానికా?” అని నరాల సత్యనారాయణను ప్రశ్నించారు. కొత్త సభ్యుల నుంచి డబ్బులు తీసుకుని, తర్వాత వారిని పార్టీ నుంచి తొలగించే విధానం కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఎవరూ ఈ పార్టీలో చేరి మోసపోవద్దని, సభ్యత్వ రుసుములు చెల్లించే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.