ఖమ్మం, జూన్ 22 (వార్త సంధ్య) : ఖమ్మం నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించిందని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం, లింగరాజు–స్వాతి దంపతులకు ఆరు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా ఖమ్మం నగరంలోని పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ కుటుంబం స్వగ్రామం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు. స్వగ్రామానికి వెళ్లి ఉండాలన్న విషయంలో దంపతుల మధ్య తరచూ విభేదాలు జరుగుతున్నట్లు తెలిసింది. భర్త ఇంట్లో లేని సమయంలో పిల్లలకు ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.