భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 10 (వార్త సంధ్య) : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ వారి జీవనాన్ని దుర్భరంగా మారుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇంధన, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం మరోసారి అదనపు భారాలు మోపడం దుర్మార్గమన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చి పేదల బ్రతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నారని, మరోవైపు బ్లాక్ మార్కెట్ దందాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధనవంతులకు ఊడిగం చేస్తూ పేదల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ధరల పెరుగుదలపై, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ శ్రేణులు రాజీలేని పోరాటాలకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించి దిగ్బంధనం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాబీర్ పాషా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.