కామారెడ్డిలో అరుదైన POEM చికిత్స విజయవంతం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 13 ( వార్త సంధ్య )
: అన్నం, నీరు మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన మరియు అధునాతనమైన POEM (Peroral Endoscopic Myotomy) చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు.
కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన ప్రెస్మీట్లో వైద్యులు మాట్లాడుతూ, రోగి చాలా కాలంగా ఆహారం సరిగా మింగలేకపోవడం, తిన్న ఆహారం కిందికి వెళ్లకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం సమస్యను గుర్తించి, ఎండోస్కోపిక్ విధానమైన POEM ద్వారా చికిత్స అందించినట్లు వెల్లడించారు.
వైద్యుల వివరాల ప్రకారం, ఈ చికిత్సలో పెద్ద కోతలు అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆహారనాళంలోని సమస్యాత్మక కండరాలను సడలించే విధంగా చికిత్స నిర్వహిస్తారు. దీంతో మింగడంలో ఉన్న ఇబ్బందులు తగ్గి, రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే గాయం తక్కువగా ఉండటం, నొప్పి తగ్గడం, కోలుకునే సమయం తగ్గడం ఈ విధానం ప్రత్యేకతలని పేర్కొన్నారు.
ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్కు చెందిన డా. బి. శృతి సాగర్ (MD, DM Gastro), కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వెల్లడించారు. ఆయన అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ విధానాలైన ERCP, EUS, అలాగే హెపటోబిలియరీ మరియు ప్యాంక్రియాటిక్ వ్యాధుల చికిత్సలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారని తెలిపారు.
కామారెడ్డి ప్రాంతంలోనే అధునాతన గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల క్లిష్టమైన సమస్యలకు మెరుగైన చికిత్స పొందేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని వైద్యులు పేర్కొన్నారు.