కామారెడ్డిలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి జూన్ 22 ( వార్తా సంధ్య ) కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” (Yoga for Healthy Ageing) అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, డెప్యూటీ డీఎంహెచ్ఓ ముఖ్య అతిథులుగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యోగా నోడల్ అధికారి మల్లికా జునైద్, డాక్టర్ దీప, డాక్టర్ దేవయ్య, డాక్టర్ భవానీ ప్రసాద్, సీనియర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. యోగా దినోత్సవ వేడుకల్లో వైద్య సిబ్బంది, యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.